హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) 10 రోజులపాటు పొడిగించింది. తొలుత ప్రకటించిన అసలు షెడ్యూల్ ప్రకారం ఈ గడువు మంగళవారంతో (జూలై 14) ముగియాల్సి ఉండగా, దీనిని జూలై 24 వరకు పొడిగిస్తూ ఈసీఐ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో గడువు పెంచాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్యాదవ్ ఈసీకి లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇక్కడ కూడా గడువు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ల ఫారాల (ఈఎఫ్) పంపిణీ దాదాపు పూర్తయినట్టు (99.98 శాతం) తెలంగాణ సీఈవో కార్యాలయం వెల్లడించింది. కానీ, ఈఎఫ్ల స్వీకరణ, ఆన్లైన్ డిజిటలైజేషన్ సగం కూడా పూర్తికాలేదు. రాష్ట్రంలో సగటు డిజిటలైజేషన్ 42.78 శాతం మాత్రమే చేరింది. నగర, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం కూడా పూర్తికాలేదు. ఈఎఫ్ల సమర్పణకు ఇంకా కేవలం పది రోజులే (జూలై 24) మిగిలి ఉన్నాయి. జూన్ 25 నుంచి ఇప్పటివరకు 20 రోజుల్లో 42 శాతం అయిన డిజిటలైజేషన్, పది రోజుల్లో 100 శాతం పూర్తి కావడం కష్టమేనని రాజకీయ పార్టీ నేతలు అంటున్నారు.