జీడిమెట్ల, డిసెంబర్ 20: ఆ మహిళ వయస్సు 45 ఏండ్లు. తోడుండాల్సిన భర్త విడాకుల పేరుతో వదిలించుకున్నాడు. ఇన్నేండ్లు జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె అనారోగ్యంతో తనువు చాలించింది. తల్లి, తమ్ముడికి ఉన్న మానసిక వైకల్యం.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించలేని నిస్సహాయంగా మార్చింది. మరణ వార్తను బంధువులకు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వారంపాటు ఇంట్లోనే శవంతో గడిపిన దారుణ ఘటన హైదరాబాద్లోని చింతల్లో వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటాపురానికి చెందిన సుబ్బారావు, విజయలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. కుమారుడు ప్రవీణ్కుమార్ హైదరాబాద్లో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలయ్యాయి. చిన్న కూతురు రాధాకుమారి (45)కి పెండ్లి అయిన కొంతకాలానికే భర్త విడాకులు ఇచ్చాడు. ఆమె గ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉండేది.
కొన్నాళ్ల క్రితం సుబ్బారావు చనిపోగా తల్లి విజయలక్ష్మి, అక్క రాధాకుమారి హైదరాబాద్లోని చింతల్లో ఉండే ప్రవీణ్కుమార్ వద్దకు వచ్చి ఉంటున్నారు. ప్రవీణ్కుమార్కు తరచూ మానసికస్థితి సరిగా ఉండకపోవడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. వృద్ధురాలైన విజయలక్ష్మికి కూడా మానసికస్థితి దెబ్బతిన్నది. అప్పటి నుంచి చింతల్లో కిరాయి ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం స్థానికులతో పెద్దగా కలిసేవారు కాదు.
వారం క్రితం చనిపోయిన అక్క
రాధాకుమారి ఇటీవల అనారోగ్యానికి గురై వారం క్రితం చనిపోయింది. మానసికస్థితి సరిగా లేక ప్రవీణ్కుమార్ ఎవరినీ అడగలేకపోయాడు. అక్క చనిపోయిన విషయాన్ని బంధువులతో ఫోన్లో చెప్పినా స్పందించలేదని తెలుస్తున్నది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక తల్లి, కుమారుడు వారం రోజులుగా ఇంట్లో మృతదేహంతోనే ఉంటున్నారు. సమీపంలో నివాసం ఉండే ఓ వ్యక్తి బుధవారం వారింటి వైపు రాగా దర్వాసన వచ్చింది. స్థానికులతో కలిసి గదిలో కి వెళ్లి చూడగా రాధాకుమారి మృతదేహం కుళ్లినస్థితిలో కనిపించింది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి అంత్యక్రియలకు పంపారు.