ఆదిలాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ కాంగ్రెస్లో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ టికెట్ను ఆరెస్సెస్ కార్యకర్తకు ఇచ్చారని, ఓడిపోయే అభ్యర్థి కోసం తాను పనిచేయబోనంటూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ తేల్చి చెప్పారు. సోమవారం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ‘సేవ్ కాంగ్రెస్ ఫ్రం ఆరెస్సెస్’ పేరిట నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో సాజిద్ఖాన్ మాట్లాడారు. తాను చనిపోతే ఆరెస్సెస్ కండువా కప్పాలని కంది శ్రీనివాస్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తికి ముస్లింలు ఎలా ఓటువేస్తారని ప్రశ్నించారు.
అవసరమైతే పార్టీని అయినా వదులుకుంటాను తప్పితే ఆయనకు మద్దతు ఇవ్వబోనని కుండబద్దలుగొట్టారు. కష్టకాలంలో జెండా మోసిన తనతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు సంజీవ్రెడ్డిని కాదని డబ్బున్న ఎన్నారై కందికి అధిష్ఠానం టికెట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మథోల్లో నారాయణరావుపటేల్, ఆసిఫాబాద్లో శ్యాంనాయక్ వంటి ప్యారాచూట్ నాయకులకు టికెట్ ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తన నిర్ణయం మార్చుకోకుంటే మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అల్లుడు సంజీవరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కార్యకర్తలు స్పష్టం చేశారు.
కాంగ్రెస్లో డబ్బుంటేనే రాజకీయాలు
డబ్బుంటేనే రాజకీయాలు అనే పరిస్థితిని పార్టీ తీసుకొచ్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత ఆరోపించారు. రేవంత్రెడ్డి ముఖం చాటేసి ఢిల్లీ వెళ్లి సీట్ల పంపిణీ చేపట్టారని మండిపడ్డారు. కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
బోథ్లో నిరసన ర్యాలీ
బోథ్ టికెట్ను వన్నెల అశోక్కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇచ్చోడలో కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీకోసం ఏండ్లుగా సేవలు అందిస్తున్న వారిని కాదని, ప్రేమ్సాగర్రావు సూచించిన వారికి అధిష్ఠానం టికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.