Shilajit Tablets | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ‘శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది’ అంటూ తప్పుడు ప్రచారంతో విక్రయిస్తున్న ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనిఖీలు జరిపినప్పుడు ‘శైలాజిత్ ఆయుర్వేద ట్యాబ్లెట్ల’ పేరుతో విక్రయిస్తున్నట్టు గుర్తించామని డీసీఏ డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు.
వీటిని విజయవాడ గవర్నర్ పేటలో ‘మనఫార్ ఆయుర్వేదిక్ డ్రగ్స్’ అనే కంపెనీలో తయారు చేస్తున్నారని చెప్పారు. వీటి తయారీకి ఎలాంటి లైసెన్స్ లేదని, పైగా 1929 నుంచి ఈ ఔషధాన్ని అమ్ముతున్నట్టు ట్యాబ్లెట్లపై ముద్రిస్తున్నారని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం చెట్టూర్లో రాజేశ్కుమార్ అనే ఆర్ఎంపీ ‘శ్రీ వినాయక మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్’ పేరుతో ఎలాంటి లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. రూ.36 వేల విలువైన 49 రకాల మందులను నిల్వ చేయగా, మెడికల్ షాప్ను సీజ్ చేశామని వెల్లడించారు.