హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశ సంపదను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజలు ఢిల్లీలో బిలియన్మార్చ్ చేసే రోజులు దగ్గరపడ్డాయని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హెచ్చరించారు. బీజేపీకి అవకాశమొస్తే పంచభూతాలను అమ్మేస్తుందని ధ్వజమెత్తారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అంటే ప్రజాకంటక పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసేవారిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రఘునందన్రావు కడ్లుండీ చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టానికి క్రీడా పాలసీ లేదనడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ గచ్చిబౌలి స్టేడియంలో టిమ్స్ దవాఖానను నెలకొల్పారని గుర్తుచేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆటల కన్నా ప్రజల ప్రాణాలను రక్షించటమే పరమావధిగా భావించటం తప్పా అని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవటానికి దవాఖాన నిర్మించకూడదని రఘునందన్ అభిప్రాయమా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించిన విషయాన్ని విస్మరించటం దారుణమని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం లేకపోతే మంజూరు చేయించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ప్రోత్సాహాన్ని భారీస్థాయిలో పెంచారని గుర్తుచేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం సబ్కమిటీని నియమించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి, హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపిస్తారని పేర్కొన్నారు.