హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): క్యాతనపల్లి మున్సిపాలిటీ నుంచే అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్డౌన్ ప్రారంభమైందని, మంత్రి వివేక్ వెంకటస్వామికి చెన్నూరు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమైపోయిందని శాసనసభ మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా, ఎన్నిరోజులు వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు మిత్రపక్షంగా ఉన్న సీపీఐకి కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించారు. ప్రజాతీర్పునకు అనుగుణంగా గెలిచిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నిక కాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. అసలు సుమన్ చేసిన తప్పేమిటని నిలదీశారు. సుమన్ను భేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ కూటమికి 14 వార్డులతో పూర్తి మెజారిటీ ఉన్నదని వివరించారు. కానీ, ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపినా కాంగ్రెస్ పార్టీకి 10 ఓట్లే ఉన్నాయని దుయ్యబట్టారు. జనగామ, తొర్రూరు, ఆమన్గల్లో చేసినట్టు క్యాతనపల్లిలో చేయాలని కాంగ్రెస్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి: చిరుమళ్ల రాకేశ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దీనికి బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. క్యాతనపల్లిలో ఓడిపోతే, తన మంత్రి పదవి ఎక్కడ పోతుందేమోనని వివేక్ భయపడుతున్నారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అరాచకాలను క్యాతనపల్లిలో బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, బీఆర్ఎస్, సీపీఐ కూటమి కౌన్సిలర్లను కాపాడుకుంటామని స్పష్టంచేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.