హైదరాబాద్, జూలై2 (నమస్తే తెలంగాణ): ఓబీసీ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని ఓబీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నెలలో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సమితి తరఫున ఆదివారం బహిరంగలేఖ విడుదల చేశారు.
ఓబీసీ క్రీమీలేయర్ పరిమితిని పెంచపోవడంతో అనేక మంది ఆ వర్గాల ఉద్యోగుల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో బీసీలు అనేక విధాలుగా నష్టపోతున్నారని, ప్రధాని మోదీ ఇప్పటికైనా ఆ వర్గాలను పట్టించుకోవాలని కోరారు. బీసీల జనగణన చేపడుతామని 2018లో హోంమంత్రి రాజ్నాథ్సింగ్ పార్లమెంటులో ప్రకటించినా నేటికీ అమలుకు నోచలేదని తెలిపారు. వెంటనే కేంద్ర ం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.