హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన అంశంపై తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ తీర్మానం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ విషయమై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి కులవృత్తులకు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
బీహార్ రాష్ట్రం మాదిరి కులగణనను వెంటనే ప్రారంభించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల అవకాశాలను 42 శాతానికి పెంచుతామన్న హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించి బీసీ నాయకత్వ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.