హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నారని ఎంపీ కే కేశవరావు కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ ఆరోపించారు. కేశవరావు పదవుల కోసం పార్టీ మారుతారని తాను అనుకోవడంలేదని, ఆయనకు పదవులు కొత్త కాదని చెప్పారు. తన సోదరి, మేయర్ విజయలక్ష్మితోపాటు పార్టీ మారే నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ మారే అంశంపై వారు తనతో చర్చించలేదని తెలిపారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి కేశవరావు బీఆర్ఎస్ను వీడటం బాధగా ఉన్నదని చెప్పారు.
ఈ వయసులో పార్టీని వీడటం ఏమిటని ప్రశ్నించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ను వీడటం సరికాదని, కేసీఆర్కు అండదండగా నిలబడి, తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ మారే అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. తన సోదరి, మేయర్ విజయలక్ష్మిని కార్పొరేటర్ను, మేయర్ను చేసిందే బీఆర్ఎస్ అని చెప్పారు. ఆత్మగౌరవం ఉన్న వారు పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. దానం నాగేందర్ నమ్మదగిన వ్యక్తి కాదని, ఆయన ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండరని వ్యాఖ్యానించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడనని స్పష్టంచేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించనని సీఎంగా ప్రమాణ స్వీకార సమయంలో చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు.
అధికారం పోగానే ఆత్మగౌరవం గుర్తొచ్చిందా?: శ్రవణ్
అధికారం పోగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బార్ ముందు బీడీలు అమ్ముకునేటోడు అని రేవంత్ అనటం ఆత్మగౌరవమా? అని నిలదీశారు. ఏ సామాజిక న్యాయం పాటిస్తున్నారని కాంగ్రెస్లోకి వెళ్లారని అడిగారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణభవన్లో మీడియాతో బీఆర్ఎస్ నేతలు కే విప్లవ్కుమార్, మన్నె గోవర్ధన్రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్తు వైస్చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, నారాయణతో కలిసి శ్రవణ్ మాట్లాడారు. దానం నాగేందర్కు బీఆర్ఎస్లో అన్ని విధాల గౌరవం దక్కిందని తెలిపారు. ఖైరతాబాద్ ప్రజలు దానంకు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. ఆనాడు పార్టీలు మారే ఎమ్మెల్యేపై రాళ్లతో దాడి చేయాలని, ఇంటి వద్ద ధర్నాలు చేయాలని, శవయాత్రలు, ఉరితీయాలని పిలుపునిచ్చిన రేవంత్.. ఇప్పుడేం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.