పైకి కాషాయం కట్టి సన్యాసిలా కనిపించినా, రామచంద్ర భారతికి వివాహమయింది. కేంద్ర హోంశాఖలో పనిచేసిన పారుల్ను పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరు విడిగా ఉన్నారు. తర్వాత మళ్లీ కలిసి ఉంటున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో హోంశాఖలో పనిచేసిన పారుల్.. ఆర్సీబీతో వివాహం తర్వాత దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన నీతిఆయోగ్లోకి మారింది.
నీతిఆయోగ్లో ఉండే కీలకమైన సమాచారం పారుల్ నుంచి రామచంద్రభారతికి బదిలీ అయినట్టు డాటా సూచిస్తున్నదని, ఆ మేరకు కాల్డాటాలో అనేక వివరాలున్నాయని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. 8 ఏండ్లుగా దేశంలో అధికారాన్ని చెలాయిస్తున్న అహంభావంతో దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్న తీరు వారికి పట్టపగ్గాలు లేకుండా చేసింది. అదృష్టం బాగోలేక రాజకీయ దురంధరుడైన కేసీఆర్ గడ్డమీదికి వచ్చారు. ఆయన గట్టిగా పిడికిలి బిగించగానే అందులో చిక్కుకుపోయారు.
– ఓ సీనియర్ పాత్రికేయుడి విశ్లేషణ
దాదాపు 200 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ అంశానికి సంబంధించిన సీడీలు తమకు కావాలని, తాము కూడా దీనిపై పరిశోధన చేస్తామని అడిగి మరీ తీసుకుంటున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి. వీరిలో అనేకమంది తాము మోదీ ప్రభుత్వ బాధితులమని, ఆ ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలతో అనేక రకాలుగా దెబ్బతిన్నామని పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘ఎవరా స్వాములు? మాకేం తెలుసు? డబ్బులు ఆఫర్ చేసిన గాలిగొట్టంగాళ్లు’.. ఎమ్మెల్యేలతో బేరసారాల కుతం త్రం బయటపడిన మరునాడు, అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలివి. బండి చెప్పింది నిజమా? ఫాంహౌజ్లో పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన స్వాములు.. అందునా రామచంద్రభారతి (ఆర్సీబీ) అనే ఉత్తరాది స్వామి గొట్టంగాడా? లేక ఢిల్లీ అధికార కారిడార్లలో తారట్లాడుతూ ప్రభుత్వ పెద్దల పనులు చక్కబెట్టే మార్మిక స్వామా?.. ఈ రెండోదే నిజం. రామచంద్రభారతి సామాన్యుడు కాడు. ఆయన వ్యవహారాలు కూడా సామాన్యమైనవి కావు.. అని సిట్ దర్యాప్తులో బయటపడుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రామచంద్ర భారతి ప్రొఫైల్, అతనికున్న పరిచయాలు, అతనితో సంపర్కంలో ఉన్న ముఖ్యులు, అతని వ్యవహారాలు తెలిసి పోలీసు అధికారులకే దిమ్మతిరిగిపోతున్నట్టు అవి వెల్లడించాయి. ప్రస్తుత అధికార వ్యవస్థలోని కోర్ గ్రూప్లో ఆర్సీబీ ఒక కీలక సభ్యుడని, ఢిల్లీలోని అనేకమందికి ఈ విషయం తెలుసని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఫాంహౌజ్ కేసులో రామచంద్ర భారతి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్, ల్యాప్టాప్ల నుంచి పోలీసులు డాటాను వెలికితీసినప్పుడు.. దాదాపు 5 టెరాబైట్ల దాక సమాచారం బయటపడినట్టు తెలిసింది. ఇలా బయటపడిన డాటాలో కొంత ఎన్క్రిప్టెడ్గానూ (కోడ్ లాంగ్వేజ్లో), మరికొంత మామూలు భాషలోనూ ఉన్నది.
ఈ డాటాను విశ్లేషించడంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు, సిట్ నిపుణులు, సాంకేతిక నిపుణులు తలనముకలై ఉన్నారు. ఈ డాటా విశ్లేషణలో అత్యంత ఆసక్తికర విశేషాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఆర్సీబీ పైకి కాషాయం ధరించి సన్యాసి వేషం వేసుకుంటాడు. ఆ వేషంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలొంటాడు. తనకు ఒక విశ్వసనీయతను, గౌరవాన్ని కల్పించుకోవడానికి కాషాయం ఉపయోగించుకుంటాడు. తద్వారా కలిగే పరిచయాలను తాను చేసే వ్యవహారాల కోసం వినియోగించుకుంటాడని సమాచారం. పైకి సన్యాసిలా కనిపించినా, ఆయనకు పెళ్లి అయినట్టు తెలుస్తున్నది. కేంద్ర హోంశాఖలో పనిచేసిన పారుల్ అనే మహిళతో ఈయనకు వివాహమైంది. కారణాలేవో తెలియదు కానీ, కొంతకాలంపాటు విడిగా ఉన్నారు. తర్వాత మళ్లీ కలిసి ఉంటున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పారుల్.. ఆర్సీబీతో వివాహం తర్వాత దేశంలోనే అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన నీతిఆయోగ్లోకి మారింది. అక్కడి కీలకమైన సమాచారం పారుల్ నుంచి రామచంద్రభారతికి బదిలీ అయినట్టు డాటా సూచిస్తున్నదని, ఆ మేరకు కాల్డాటాలో అనేక వివరాలున్నాయని సిట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ సీపీ ఎవరో ముందే తెలుసు
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అవుతున్నారో కూడా అందరికంటే వారం ముందే ఆర్సీబీకి తెలిసినట్టు ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆయన దగ్గర దొరికిన సమాచారం వందశాతం నిజమేనని తర్వాత రుజువైంది. ఆయన కాల్డాటాలో బయటపడిన పేరే.. తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఖరారయ్యారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రం పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే అక్కడ సీపీని నియమిస్తుంది. దీన్నిబట్టి ఆర్సీబీకి ఏ స్థాయిలో సంబంధాలున్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
జగ్గుస్వామితో మంతనాలు
మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు సంబంధించి.. రామచంద్ర భారతి కేరళలోని జగ్గుస్వామి అనే వ్యక్తితో సంభాషించినట్టు కాల్డాటాలో వెల్లడైందని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం కోసం విటమిన్-ఎం సిద్ధం చేయాల్సిందిగా ఆ సందర్భంగా ఆర్సీబీ జగ్గుస్వామిని కోరినట్టు సమాచారం. జగ్గుస్వామి కేరళలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ మాతాజీకి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తున్నది. ఆ మాతాజీకి సంబంధించిన సంస్థ ఇటీవలే ఫరీదాబాద్లో ఆరువేల పడకలతో అతిపెద్ద దవాఖానను నిర్మించింది. దీని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ స్వయంగా హాజరయ్యారు. ఈ ప్రారంభ వేడుకకు ప్రధానిని రప్పించడంలో ఆర్సీబీ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం అందిందని సిట్ వర్గాలు వెల్లడించాయి. ఆశ్చర్యకరమైన మరో అంశం ఏమిటంటే, అనేకమంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ సీడీలు తమకు కావాలని, తాము కూడా దీనిపై పరిశోధన చేస్తామని అడిగి మరీ తీసుకుంటున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దాదాపు 200మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి ఇలాంటి విజ్ఞప్తులు అందినట్టు వెల్లడించాయి. వీరిలో అనేకమంది తాము మోదీ ప్రభుత్వ బాధితులమని, ఆ ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలతో అనేకరకాలుగా దెబ్బతిన్నామని పేర్కొనడం గమనార్హం.
ఏకకాలంలో 30చోట్ల డాటా విశ్లేషణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తవ్వుకుంటూ పోయినకొద్దీ రామచంద్ర భారతికి సంబంధించిన లక్షలాది పేజీల సమాచారం బయటపడుతున్నదని పోలీసుల వర్గాలు వివరించాయి. డాటా చాలా భారీ ఎత్తున ఉండటం, అందులో కొంత ఎన్క్రిప్టెడ్గానూ ఉండటంతో మొత్తం వెలికితీసేందుకు సమయం పడుతున్నదని, సమాచారం విశ్లేషణలో అందుకే ఆలస్యం జరుగుతున్నదని సిట్ వర్గాలు వెల్లడించాయి. అందుకే ఇప్పుడు ఏకకాలంలో అనేక నగరాల్లో డాటా విశ్లేషణ జరుగుతున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సహా 30 చోట్ల డాటా విశ్లేషణ సమాంతరంగా కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. పోలీసు, సీఐడీ, నిఘావర్గాలే కాకుండా, ఎక్కడికక్కడ మీడియా సంస్థలు కూడా ఈ సమాచార విశ్లేషణలో పాల్గొంటున్నట్టు తెలిసింది. విశ్లేషణలో వెల్లడవుతున్న సమాచారం చూసి నిపుణులు, పాత్రికేయులే విస్తుపోతున్నారు. రామచంద్ర భారతికి ఉన్న పరిచయాలను, చేసిన పనులను చూసిన వారు.. ఇంతపెద్ద వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు ఇంత ఆషామాషీగా ఎలా చేశారు? అని ఆశ్చర్యపోతున్నట్టు తెలిసింది.
‘బీజేపీ పెద్దలు అతివిశ్వాసంతో పోయి ఇరుక్కుపోయారు.. ఇండియాలో మనకు ఎదురే లేదు. కాంగ్రెస్ను పూర్తిగా కొట్టేసినం. ఇక మిగిలినవి చిల్లరమల్లర ప్రాంతీయ పార్టీలు. వాటిని కూడా ఓ పట్టు పడితే మనల్ని ఇక ఢీకొట్టే మొనగాడే ఉండడు. కాంగ్రెస్నే కొట్టిన మనకు, ఈ ప్రాంతీయ పార్టీల నేతలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అని బీజేపీ పెద్దలు అనుకున్నారు. 8 ఏండ్లుగా దేశంలో అధికారాన్ని చెలాయిస్తున్న తీరు వారిలో ఇలాంటి అహంభావాన్ని పెం చింది. అడ్డూ అదుపూ లేకుండా దర్యాప్తు సంస్థ ల్ని దుర్వినియోగం చేయగలుగుతున్న వాతావరణం వారికి పట్టపగ్గాలు లేకుండా చేసింది. ఈ క్రమంలోనే మనల్ని ఎవరేం చేస్తారు? అనే ధోరణిలో హైదరాబాద్లో ఆపరేషన్ కమల్కు పూనుకున్నారు. వారి ఖర్మం చాలక, అదృష్టం బాగోలేక సీనియర్ రాజకీయ దురంధరుడైన కేసీఆర్ గడ్డమీదికి వచ్చారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అనేక వ్యవహారాలను చూసిన కేసీఆర్.. గట్టిగా పిడికిలి బిగించగానే అందులో చిక్కుకుపోయారు’.. అని ఓ సీనియర్ పాత్రికేయుడు విశ్లేషించారు. ఆ ఉక్రోషం నుంచి తన్నుకొచ్చిందే.. మోదీ బేగంపేటలో చేసిన ప్రసంగమని పేర్కొన్నారు.
అనేక కీలక వ్యవహారాల్లో ఆర్సీబీ
దశాబ్దాల తరబడి బీజేపీలో ముఖ్యులుగా ఉన్న నాయకులు కూడా పదవుల కోసం ఆర్సీబీని సంప్రదించేవారంటే ఢిల్లీ అధికార వర్గాల్లో ఆయన హవా ఏ స్థాయిలో చెలామణి అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. డాటాలో లభ్యమైన వివరాలను బట్టి, సాధ్వి ప్రాచీ అనే ఆమె తనకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించాల్సిందిగా ఆర్సీబీని వేడుకున్నదంటే ప్రభుత్వంలో ఆయన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. రాజకీయ నాయకులకు పదవులు ఇప్పించడంతోనే ఆర్సీబీ సరిపెట్టలేదని, ఇంకా చాలా కీలక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడని సిట్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్ఎస్ఎస్లో కీలక స్థానాల్లో ఉన్న దత్తాత్రేయ హొసబలేతో సహా అనేకమందితో ఆర్సీబీ దిగిన ఫొటోలు, గంటలకొద్దీ జరిపిన సంభాషణల సమాచారం డాటాలో బయటపడినట్టు తెలిసింది.