బంజారాహిల్స్, మే 8: అబద్ధాలే అస్ర్తాలుగా తెలంగాణ ప్రజలను మోసగించేందుకు మరోసారి కాంగ్రెస్ నేతలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల దాకా రకరకాలైన అబద్ధ్దాలు చెప్తూ ప్రజల్లో చులకన అవుతున్నారు. మూడురోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 అందిస్తున్నామని. నిస్సిగ్గుగా అబద్ధం చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో మంగళవారం కొన్ని టీవీ చానెళ్లలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. ‘రూ.500కే అందరికీ గ్యాస్ ఇచ్చేశాం.. నాలుగున్నర లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేశాం.. 200 యూనిట్లు వాడిన వారందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం.. నిరుద్యోగులకు కొత్తగా 30 వేల ఉద్యోగాలు ఇచ్చేశాం’ అంటూ అలవోకగా అవాస్తవాలు చెప్పేశారు.
తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో భాగంగా నారీ సమ్మేళన్ పేరుతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా సైతం ఇదే కోవలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 ఏండ్లు నిండిన మహిళలకు రూ.2500 చెల్లిస్తున్నామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.1 లక్ష ఇస్తామని చెప్పడంతో అక్కడున్న మహిళలు తెల్లబోయారు. తమకు ఇప్పటివరకూ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప చిల్లిగవ్వ అందలేదని వారంతా గొణుక్కోవడం వినిపించింది. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు అల్కా లాంబా ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.2500 అందజేసే పథకం ప్రారంభమే కాలేదు.. అని చెప్పినా వినిపించుకోకుండా ఇప్పటికే తాను కొంతమంది మహిళలతో మాట్లాడానని, పదిమందిలో ఆరుగురికి నెలకు రూ.2500 వస్తున్నాయంటూ బుకాయించడంతో ఆమె వెంట ఉన్న నేతలు కూడా ఔరా అంటూ నోరు వెళ్లబెట్టారు. ఏ మాత్రం సంకోచం లేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్ నేతల తీరును చూసి జనం ఈసడించుకుంటున్నారు.