బంజారాహిల్స్, నవంబర్ 18: హైదరాబాద్ అభివృద్ధికి ఫిదా అవుతున్న యువత బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజా గా ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న ఓ యువతి బీఆర్ఎస్కు మద్దతు పలుకడంతోపాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.లక్ష విరాళం అందించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఇంటింటి ప్రచారంలో భాగంగా శనివారం ఫిలింనగర్లోని ఛత్రపతి శివాజీనగర్ బస్తీకి వెళ్లారు. బస్తీలో నివాసం ఉంటూ ఫ్యాషన్ డిజైనర్ తన్నీరు మేఘన అనే యువతి తల్లితో కలిసి దానం నాగేందర్కు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
ఎన్నికల ఖర్చు కోసం అంటూ రూ. లక్ష చెక్కును అందించడంతో దానం నాగేందర్తోసహా అక్కడున్న వారంతా షాకయ్యారు. ‘నాకు ఎందుకమ్మా డబ్బులు’? అని దానం ప్రశ్నించగా.. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లో అనేక సంస్థలు వచ్చాయని, లక్షల మంది యువతకు ఉపాధి దొరకడంతోపాటు ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తున్నదని, అందుకే తనవంతుగా పార్టీ కోసం రూ. లక్ష అందిస్తున్నానని యువతి చెప్పింది. దీంతో దానంతోపాటు వెంట ఉన్న కార్యకర్తలు మేఘనను అభినందించారు.