హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆదివారం రాష్ట్రంలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కీలకమైన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ను నియమించగా, ఆ స్థానంలో ఉన్న అర్వింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. నల్లగొండ కలెక్టర్ ఆర్వీకర్ణన్ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా నియమించింది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, హైదరాబాద్ పోలీస్ క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్కు బాధ్యతలు అప్పగించింది. వీరితోపాటు మరో ఐదుగురు సీనియర్ పోలీస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. ఇందులో కొందరు ఐపీఎస్, పోలీస్ అధికారులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
జలమండలిబోర్డుపై దానకిశోర్ తనదైన ముద్రవేశారు. ఐటీ, రెవెన్యూ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. వేసనిలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా సమృద్దిగా నీటిని అందించారు. తన పనితీరుతో బోర్డుకు అనేక అవార్డులు తెచ్చిపెట్టారు.