హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ఫైల్పై తొలి సంతకం చేశారు. 5,300 స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీపై రెండో సంతకం చేశారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు.
జర్నలిస్టులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు కష్టం అవుతుందని చెప్పారు. దీనికి బదులుగా అపార్ట్మెంట్ల మాదిరిగా కట్టించి ఇవ్వాలని హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని సూచించారు.