హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో తమ తప్పేమీ లేదనీ, అంతా ఆయనే (రేవంత్రెడ్డి) నిర్ణయించాడని, అభ్యర్థిని ప్రకటించేదాకా తమకు కూడా తెలియదని టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వాపోయినట్టు తెలిసింది. అసంతృప్తితో రగిలిపోతున్న హుజూరాబాద్ నేతల ఎదుట ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సీనియర్లు ఎదుర్కొంటున్న దుస్థితిని సూచిస్తున్నాయి. పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారన్న విమర్శలకు హుజూరాబాద్ వ్యవహారం మరింత బలాన్నిస్తున్నది. పీసీసీ సూచన మేరకు 18 మంది అభ్యర్థులు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని దరఖాస్తులిచ్చారు. స్థానిక నేతలతో చర్చించిన ఎన్నికల కమిటీ ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది. వీటిని పట్టించుకోని రేవంత్రెడ్డి స్థానికేతురుడైన బల్మూర్ వెంకట్ పేరును ఖరారు చేశారు. దరఖాస్తులు తీసుకొని, తమను అవమానించారనే కోపంతో రగిలిపోతున్న స్థానికనేతలు రేవంత్రెడ్డికి గుణపాఠం చెప్పాలనే నిర్ణయానికొచ్చారు. దీంతో వారిని బుజ్జగించేందుకు మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్కు పిలిపించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్తో కలిసి వారితో చర్చలు జరిపిన రాజనర్సింహ అభ్యర్థి ఎంపిక విషయంలో తన అసహాయతను వ్యక్తం చేయడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది.