కొత్తగూడెం క్రైం, జనవరి 9 : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతోపాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు.
అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోవి డ్ బారినపడి 21 జూన్ 2021న మృతిచెందిన విషయం విదితమే. అప్పటినుంచి తెలంగాణ కా ర్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు మావోయిస్టు నేత ఆజాద్ సైతం తనవంతు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. చివరికి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్ను నియమించింది. గతంలో భద్రతా దళాలను టార్గెట్ చేసి వారిపై కాల్పుల జరపడంతోపాటు ల్యాండ్మైన్ పేల్చిన ఘటనల్లో ఈయన కీలక పాత్ర పోషించాడు. పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.