జగిత్యాలలో ఓ వ్యక్తి వినూత్న నిరసన
జగిత్యాల అర్బన్, ఆగస్టు 30: తాను నాటిన మొక్కను నరికేశాడని ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. జగిత్యాల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. జగిత్యాల పట్టణంలోని ఎల్జీ రాం లాడ్జి పక్క వీధిలో ప్రభాకర్ రెండేళ్ల కిందట హరితహారంలో భాగంగా ఓ మొక్క నాటాడు. కాగా ప్రస్తుతం అది పెరిగింది. తనపై కోపంతో తన బంధువులు ఆ చెట్టును నరికివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నరికిన చెట్టు వద్ద ప్రభాకర్ నిరసన తెలిపాడు. స్పందించిన మున్సిపల్ అధికారులు బాధ్యుడిని గుర్తించి రూ.5 వేల జరిమానా విధించి మరో మొక్కను నాటించారు. దీంతో ప్రభాకర్ తన నిరసనను విరమించాడు.