146 మంది లబ్ధిదారులకు 63 యూనిట్లు
అందులో 51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 6 డీసీఎం వ్యాన్లు,
1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 1 వరి నాటు యంత్రం
అందజేసిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అద్భుత దృశ్యం
51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం.. ఇవన్నీ ఒక్క చోట కనిపిస్తే..! అవన్నీ ఉచితంగా పంచేస్తే..! అవును! బడుగుల బతుకులను బాగు చేసేందుకు ‘దళితబంధు’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు అందజేసింది. ఈ అపూర్వ సన్నివేశానికి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం వేదికైంది. శనివారం 146 మంది లబ్ధిదారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ 63 యూనిట్లను అందజేశారు. లబ్ధిదారుల్లో చాలామంది గ్రూపుగా ఏర్పడి పెద్ద యూనిట్లను ఎంచుకొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 19 : ఒకే సారి 146 మంది లబ్ధిదారులకు రూ.15.30 కోట్ల విలువైన 63 యూనిట్లను అందజేసిన అరుదైన సందర్భం శనివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో చోటుచేసుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులకు ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నిన్నటి వరకు కూలీలు, డ్రైవర్లుగా పని చేసిన నిరుపేద దళితులు ఇప్పుడు దళిత బంధుతో సొంత వాహనాలు సమకూర్చుకొని, వాటికి యజమానులుగా మారడం గొప్ప విషయమని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని శ్లాఘించారు. దళిత బంధు పథకం కింద లబ్ధదారులు గ్రూపులుగా ఏర్పడి యూనిట్లను ఎంపిక చేసుకొంటున్నారని వెల్లడించారు. ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని, హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదని, మిగతా నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి: గంగుల
దళిత బంధును సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికాభివృద్ధిని సాధించాలని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వమే యూనిట్లు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రమంతా ఈ పథకం అమలవుతుందని వెల్లడించారు. కాగా, లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి గంగుల ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ సునీల్రావు, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ ట్రాక్టర్ డ్రైవర్.. హార్వెస్టర్కు ఓనర్
ఇక్కడ కనిపిస్తున్న తల్లీకొడుకులది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్. కొడుకు శ్రీరాంస్వామి తన 15వ ఏట నుంచే ఇంటి కోసం కష్టపడుతున్నాడు. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకొని ఊరిలో రైతుల వద్ద పాలేరుగా ఉండి జీవితం వెళ్లదీస్తున్నాడు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడంతో ఇప్పుడు ఈ కుటుంబం హార్వెస్టర్ కొనుక్కొన్నది. తల్లి లక్ష్మి పేరిట రూ.10 లక్షలు, తన పేరిట రూ.10 లక్షలు రావడంతో గ్రూపుగా ఏర్పడి ఈ పెద్ద మిషన్ కొనుక్కొన్నారు. నిన్న, మొన్నటి వరకు ట్రాక్టర్ నడుపుకొని కుటుంబాన్ని పోషించిన స్వామి ఇప్పుడు హార్వెస్టర్కు యజమాని అయ్యాడు. వీరే కాదు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంపిక చేసిన 17,554 కుటుంబాలు ఇదే ధీమాతో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారులు 1,195 కుటుంబాలకు 1,086 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు.
మా కోసం పుట్టిన దేవుడు
దళితబంధుతో మా జీవితాలు మారిపోతాయి. ఇన్నేండ్లు మా గురించి ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే మా గోసను దగ్గరినుంచి చూశారు. మా జీవితాలను మార్చాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయనకు జన్మంతా రుణపడి ఉంటం.
– తప్పెట రమేశ్, దళితబంధు కన్వీనర్, వీణవంక మండలం
మా జీవితం మారిపోతది
దళిత బంధుతో మా జీవితం మారిపోతది. మా బిడ్డ పేరుతో మహాలక్ష్మి ట్రాన్స్పోర్టును ఏర్పాటు చేసుకొన్నం. మా నాన్న, నేను కలిసి డీసీఎం తీసుకొన్నం. నాకు మోటర్ ఫీల్డ్లో అనుభవం ఉన్నది. స్వయంగా డ్రైవర్ను. మాకు బతుకు చూపిన దేవుడు కేసీఆర్.
– వనారస్ యాకూబ్, లబ్ధిదారుడు, వేంకటేశ్వర్లపల్లి, జమ్మికుంట