మహబూబ్నగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతకు, దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశానవాటికను ధ్వంసం చేసి, దానిని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ తొలుత రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయితే అది తమ పరిధిలోకి రాదంటూ రెండు మండలాల తహసిల్దార్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దళితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు సదరు కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు శ్మశానవాటిక పరిరక్షణ కోసం పోరాడుతున్న దళితులపై పోలీసులు ఉల్టా కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఇప్పటూరు గ్రామ శివారులోని వాగు వెంట ఉన్న సుమారు ఎకరం భూమిని దళితులు కొన్నేండ్లుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 నుంచి 50 మృతదేహాలను అక్కడ పూడ్చిపెట్టారు.
ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో సైతం దళితుల శ్మశాన వాటికగానే నమోదై ఉన్నది. కాగా వారం క్రితం రాజాపూర్ మండలం దోండ్లపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కత్తెర కృష్ణయ్య తన అనుచరులతో ఒక జేసీబీని తీసుకొచ్చి శ్మశానవాటికను ధ్వంసం చేశాడని, ఆ భూమిని చదును చేశాడని దళితులు ఆరోపిస్తున్నారు. ఈ శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల గైరాన్ భూమిని కత్తెర కృష్ణయ్య గతంలోనే పట్టా పొందినట్టు సమా చారం. కృష్ణయ్యపై చర్య తీసుకోవాలంటూ కోడగంటి మహేశ్వర్ తదితరులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
తహసిల్దార్ సూచన మేరకు రెవెన్యూ, మై నింగ్ శాఖల అధికారులు ఈ భూమిని సర్వే చేసేందుకు వచ్చారని, అయితే, ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేయడంతో వారు వెనుదిరిగి పోయారని దళితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ఇది రెండు మండలాల సరిహద్దు ప్రాంతం. మళ్లీ వస్తాం’ అంటూ అధికారులు వెళ్లిపోయారని దళితులు చెప్తున్నారు. చివరకు ఈ శ్మశానవాటిక రాజాపూర్ మండలం పరిధిలోకి వస్తుందని తహసిల్దార్ నివేదిక ఇచ్చారు. మరోవైపు అకారణంగా తన పొలంపైకి వచ్చారంటూ పలువురు దళితులపై కాంగ్రెస్ నేత కృష్ణయ్య రాజాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో శ్మశానవాటిక పరిరక్షణ కోసం పోరాడుతున్న కోడుగంటి మహేశ్వర్, ఇస్తారయ్య, చంద్రయ్య, బుర్ర బుడ్డయ్య, లక్ష్మయ్య, యాదయ్యపై రాజాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరురెడ్డి ప్రోద్భలంతోనే పోలీసులు తమపై కేసులు నమోదు చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాజాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి శ్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు దళితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ను కలెక్టర్ ఆదేశించారు.
ఇసుక దందా కోసమే..
రాజాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఆయన అనుచరులు దళితుల శ్మశానవాటికను ధ్వంసం చేశారు. మా పూర్వీకుల సమాధులన్నింటినీ నాశనం చేశారు. జేసీబీతో చదును చేస్తుంటే పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. వాటిని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఇసుక దందా కోసం చేస్తున్నారు. శ్మశానవాటిక జోలికి రాబోమని గతంలో రెండు గ్రామాలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా శ్మశానవాటికను ధ్వంసం చేయడమే కాకుండా మాపై తప్పుడు కేసులు పెట్టారు. వీటికి భయపడేది లేదు. శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించి హద్దులు పాతకపోతే ఆందోళన చేస్తాం.
– కోడుగంటి మహేశ్వర్, ఇప్పటూరు,నవాబ్పేట మండలం, మహబూబ్నగర్ జిల్లా
విచారణ చేస్తున్నాం
ఇప్పటూర్ దళితుల స్మశానవాటికను రాజాపూర్ మండలం దోండ్లపల్లికి చెందిన కత్తెర కృష్ణయ్య ఆక్రమించారని దళితులు ఆందోళన చేశారు. రెండు మండలాల పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేయించాం. ఆ భూమిలో కృష్ణయ్య రాతి కడిలు పెట్టాడు. వాటిని ఇప్పటూర్ దళితులు ధ్వంసం చేశారంటూ కృష్ణయ్య పోలీసులకు ఫిర్యా దు చేశారు. కృష్ణయ్య శ్మశానవాటికను ఆక్రమించారంటూ ఇప్పటూర్ దళితులు కూడా ఫిర్యాదు చేశా రు. ఈ వివాదంపై విచారణ జరిపిస్తున్నాం.
– వెంకట్రెడ్డి, ఎస్సై, రాజాపూర్ మండలం
అది ప్రభుత్వ భూమి
దళితుల ఫిర్యాదు మేరకు రెండు మండలాలకు చెందిన పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో శ్మశాన వాటికను సర్వే చేయించాం. ఈ భూమిలో కత్తెర కృష్ణయ్యకు 17.26 ఎకరాల పొలం ఉండగా, అదనంగా వాగులో ఉన్న 12 గుంటలు కూడా సాగు చేశారు. ఇందులో దళితులకు సంబంధించిన ఎలాంటి గోరీలు లేవు. ఈ వాగు పొలంతో దళితులకు గానీ, కృష్ణయ్యకుగానీ సంబంధం లేదు. ఇది ప్రభుత్వ భూమి.
– ఖదీర్, ఆర్ఐ, రాజాపూర్ మండలం