నర్మెట, ఫిబ్రవరి 2: దళితబంధు కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు శుక్రవారం జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫాంహౌస్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దళితులు జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంతాపూర్ గ్రామం దొడ్లగడ్డ తండాలోని ముత్తిరెడ్డి ఫాంహౌస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. దళితబంధు కోసం ఉమ్మడి మండలంలోని 62 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసి తానే స్వయంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇచ్చినట్టు తెలిపారు. సదరు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరితే కొద్దిరోజులుగా రేపుమాపు అంటూ తిప్పుతున్నాడని పేర్కొన్నారు. వెంటనే తమ వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వారు ఫాంహౌస్ గేటు ఎదుట నినాదాలు చేశారు.
జనగామ, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం కోసం ఎవరివద్దా ఒక్క పైసా తీసుకోలేదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సొంత కూతురిని ఉసిగొల్పి మాట్లాడించారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అదేరకమైన రాజకీయ కుట్రకు తెరలేపారని విమర్శించారు. తన పేరును వాడుకొని ఎవరైనా డబ్బులు తీసుకుంటే దానికి వారే బాధ్యులు అవుతారని అన్నారు. డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు.