దళిత బంధు అమలుకు అడుగుపడింది. హుజూరాబాద్ గడ్డ దళిత బిడ్డలకు పండుగ వచ్చింది. పథకం కోసం ఏకంగా 500 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెను వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా చూస్తే.. తొలివిడుత ఐదు వేల కుటుంబాలకు ఏకకాలంలో లబ్ధి కల్పించే అవకాశమున్నది. ఈ నిధుల విషయం తెలుసుకున్న దళిత బిడ్డలు హుజూరాబాద్ గడ్డపై దరహాసంతో దరువేశారు. ‘మా దేవుడు నువ్వేనయ్యా’ ‘కష్టాలు తీర్చే నాయకుడు కేసీఆరే’ అంటూ నినదించారు. స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చి, సంబురాలు చేసుకున్నారు. – కరీంనగర్ ప్రతినిధి/కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ ప్రతినిధి/ కరీంనగర్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : దళితుల దశాదిశ మార్చే దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16న హుజూరాబాద్ గడ్డపై అధికారికంగా ప్రారంభం కానున్న విషయం విదితమే. ఇక్కడ లక్ష మందితో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పథకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో పథకం అమలుకు కావాల్సిన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్లో దళిత కుటుంబాల సంఖ్య 20,929 ఉండగా, సర్వే దాదాపు పూర్తయింది. అందుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి చేరాయి.
నిధులు విడుదల చేయడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అన్ని మండలాల్లో దళితులు సంబురాలు చేసుకుంటున్నారు. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపళ్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. స్థానిక దళితులతో కలిసి పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లందకుంటలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు, సర్పంచ్లు రఫీఖాన్, రజిత, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, విజయ, రమ, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, ముస్తాఫా, వీరారెడ్డి, గణపతి, తారక్తో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. డప్పు కొడుతూ ఎమ్మెల్యే ఉత్సాహం నింపారు. హుజూరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక దళితులు సంబురాలు చేసుకున్నారు. వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.
చెప్పింది చెప్పినట్లుగా పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ పథకాన్ని అడ్డుకోవాలని కొంత మంది కుట్రలు చేస్తున్నా.. ఆ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సోమవారం 500 కోట్లను రాష్ట్ర కార్పొరేషన్కు విడుదల చేస్తూ జీవోనంబర్ 114ను విడుదల చేసింది. ఆ వెంటనే సదరు 500 కోట్లను కలెక్టర్ ఖాతాకు బదిలీ చేస్తూ.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సదరు నిధులు కరీంనగర్ కలెక్టర్ ఖాతాలోకి వచ్చి చేరాయి. సాధారణంగా ఏ పథకమైనా ప్రారంభం తర్వాత నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ, దళిత బంధు పథకానికి మాత్రం సీఎం ముందుగానే నిధులు విడుదల చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ముఖ్యమంత్రి దళితులపై చూపుతున్న ప్రేమకు ఈ నిధుల విడుదలే సాక్షమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దళితుల దారిద్య్రాన్ని పోగొట్టేందుకు దళిత బంధు తెచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధువైండు. మొట్టమొదటి సారిగా రూ.500 కోట్లు కేటాయించి నిజమైన దేవుడిగా మారిండు. కేసీఆర్ సంకల్పబలం ఎంత గొప్పదంటే ఏదైనా సాధించే వరకు విశ్రమించడు. పోరాటతత్వమే ఆయనను ఇంతటి గొప్ప నాయకున్ని చేసింది. రాష్ట్రంలో ఏ పథకం అమలు చేసిన పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. బీజేపీ నాయకుడు ఈటలకు సొంత లాభం తప్ప ప్రజల ప్రయోజనం పట్టదు. మాలాంటి దళితులకు ఆయన చేసిందేమీ లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం పాకులాడిన ఈటలకు వచ్చే ఎన్నికల్లో మా దళితులే తగిన బుద్ధి చెప్తరు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటరు.
-బత్తుల సమ్మయ్య దళిత నాయకుడు (హుజురాబాద్ టౌన్)
దళితుడినైనందుకు గర్వపడుతున్న..
గతంలో దళితుడంటే అందరికీ చిన్నచూపు ఉండేది. కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ కల్పిస్తున్న ప్రాధాన్యతకు దళితుడనైనందుకు గర్వపడుతున్న. మా దళితుల కోసం కేసీఆర్ 10లక్షల స్కీం పెట్టిండు. నేను పేయింటర్గా పనిచేస్త. ఇండ్లకు రంగులు వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుకున్న. మాకు ఇద్దరు పిల్లలు. మా కుటుంబం నా ఒక్కడి కష్టార్జితంతో బతకాలంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు దళిత బంధు కింద కేసీఆర్ సాయం చేస్త అన్నడు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకుంటం. -పుల్లూరి యాదగిరి, పేయింటర్ దళితుడు (హుజూరాబాద్)
దళిత లోకం అండగా ఉంటుంది..
ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని కేసీఆర్ మరొకసారి నిరూపించిండు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు 500 కోట్లు విడుదల చేసి చరిత్ర సృష్టించిండు. ఎంత లేదన్నా ఐదు వేల కుటుంబాలకు మేలు జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి యావత్ దళిత లోకం అండగా ఉంటుంది. కేసీఆర్ వెంటే నడుస్తుంది.
-ముక రమేశ్, దళితనాయకుడు, కౌన్సిలర్ (హుజూరాబాద్)
కారు గుర్తుకే మా ఓటు
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందకు కష్టపడుతున్నడు. ఇప్పుడు దళిత బంధు కోసం రూ.500 కోట్లు విడుదల చేసిండు. హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తున్నడు. అలాంటి మా దళితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నడు. ఇన్ని చేస్తున్న కేసీఆర్ను ఎన్నటికీ మరిచిపోం. వచ్చే ఎన్నికల్లో మా ఓటు టీఆర్ఎస్కే వేస్తం. రాజకీయాలకతీతంగా అండగా ఉంటం. –తునికి సమ్మయ్య, దళిత సంఘం నాయకుడు, సిర్సపల్లి (హుజూరాబాద్)
అభినవ అంబేదర్ కేసీఆర్
అంబేదర్ ఆశయ సాధనే లక్ష్యంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నడు. దళితులు ఎంతో వెనుకబడ్డారని గుర్తించి, వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో దళిత బంధు పథకం తెచ్చిండు. ఇది అమలైతే దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతయి. కేసీఆర్ అభినవ అంబేదర్గా చరిత్రలో నిలిచిపోతడు. దళితులందరూ అండగా కేసీఆర్ వెంట నడుస్తరు.
-మొలుగురి ప్రభాకర్, దళిత బంధు మండల కో ఆర్డినేటర్ (హుజూరాబాద్)
గుండెల్లో గుడి కడుతం..
ఇప్పటి వరకు దళితులను ఇంత పెద్ద ఎత్తున అకున చేర్చుకున్న నాయకులు లేరు. దళితులను సొంత వారిగా భావించి దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకానికి రూపకల్పన చేసిండు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా గుండెల్లో గుడి కట్టి, పూజిస్తాం. నేను దళితుడిగా పుట్టినందుకు గర్వంగా బతుకుతానని నమ్మకం కలిగింది. మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నిధులు విడుదల చేసినందుకు సంతోషంగా ఉన్నది. మాకిచ్చే సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా గడుపుత. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటం.
-తాడూరి రవి, దళిత రైతు కూలీ, రాజపల్లి (హుజూరాబాద్ టౌన్)