కరీంనగర్ : దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు.
బ్యాంకు లింకేజీ, మార్టిగేజ్, తిరిగి చెల్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు అందించి దళితులు తమ కాళ్లపై తాము నిలబడేలా సీఎం కృషచేస్తున్నారన్నారు.
జిల్లాలో దళిత బంధు పథకం ఎలాంటి అవకతవకలు లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను మంత్రి అభినందించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో 3000, కరీంనగర్లో 1400, మానకొండూరు లో 891, చొప్పదండి నియోజకవర్గం లో 707 డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు కాగా 789 గృహ నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలిపారు.
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల గురించి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సతీష్ బాబు, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.