హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే గతంలో ఎన్నడూ, ఏ పథకాన్నీ అమలు చేయని రీతిలో, అత్యంత సమగ్రంగా దళిత బంధు పథకం అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ కార్యాచరణ సిద్ధం చేశారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు చేపట్టే హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సాచ్యురేషన్తో ఈ పథకాన్ని అమలు చేస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత జనాభా 70 వేలు. ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కలిపి మొత్తమ్మీద 20,929 దళిత కుటుంబాలున్నాయి. వీరిలో అర్హులైన కుటుంబాలన్నింటికీ ప్రభుత్వం దళిత బంధు సాయాన్ని అందించనుంది. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అధ్యయనం చేయడం ద్వారా రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో దళితుల పరిస్థితి ఎలా ఉంది? పథకం అమలులో వచ్చే సాధకబాధకాలు ఏమిటి? క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అనుభవాలు, సమస్యలపై ప్రభుత్వం ఒక అవగాహనకు రానున్నది. దళిత బంధు అమలుపై ఐఏఎస్ అధికారులకు ప్రత్యక్ష అనుభవం కలిగించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా, రాష్ట్ర అధికార గణమంతా దాదాపు వారం రోజుల పాటు హుజూరాబాద్లోనే కొలువుదీరి దళితుల స్థితిగతులను మైక్రో లెవల్లో అధ్యయనం చేస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 95-100 గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఐఏఎస్ అధికారికి అప్పగిస్తారు. అంటే దాదాపు 100 మంది ఐఏఎస్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 33 మంది కలెక్టర్లు, 33 మంది అదనపు కలెక్టర్లు, మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఊరికొకరు చొప్పున బాధ్యతలు తీసుకుని ఈ బృహత్యజ్ఞంలో పాలుపంచుకుంటారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలను, ఐదుగురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. తమ మండలంలోని గ్రామాల్లో సర్వే చేసే ఐఏఎస్ అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేస్తారు. పైలట్ ప్రాజెక్టును సాచ్యురేషన్ స్థాయిలో చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అర్హులైన దళిత కుటుంబాలకు దళిత బంధు సాయం అందించడానికి అవసరమైతే 1500- 2000 కోైట్లెనా వెచ్చించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు వారం రోజుల పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే చేసి దళిత కుటుంబాల స్థితి గతులను తెలుసుకుంటారు. ఆ తర్వాత నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులుగా ఎంపిక చేయబడిన కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో (సాచురేషన్ మోడ్ లో) వర్తింప చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కనుక, ఈ అనుభవం, తర్వాత తమ జిల్లాల్లో పథకాన్ని అమలు చేసేప్పుడు ఉపయోగపడుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మైక్రో లెవల్ ప్లానింగ్తో పథకాలను రూపొందించింది. అధికారుల నివేదికలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే గత ప్రభుత్వాలకు భిన్నంగా, క్షేత్ర స్థాయి పరిస్థితులను స్వయంగా బేరీజు వేసుకుని పథకాలను తయారు చేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతులతో, స్థానిక నాయకులతో, వీఆర్వోలతో, ఇంజినీర్లతో మాట్లాడిన సందర్భాలున్నాయి. గ్రామస్థాయి ప్రణాళికలు తయారు చేసే విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా పలు గ్రామ సభల్లో పాల్గొని, ఆ అనుభవాలతో పథకాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఐఏఎస్ అధికారులను కూడా నిమగ్నం చేయనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టబోతున్న దళిత బంధు పైలట్ ప్రాజెక్టు, అధికారులకు ఒక కేస్ స్టడీగా, ఒక రోల్ మాడల్గా మారనుంది.
కరీంనగర్ నుంచి పథకాలు హిట్
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా ముఖ్యమంత్రి కేసీఆర్కు కరీంనగర్ జిల్లా ఒక సెంటిమెంట్. గతంలో అనేక కార్యక్రమాలను ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ జరిగింది కరీంనగర్ జిల్లాలోనే, ఇక తాను ఎంతగానో అభిమానించిన అన్నదాతలను ఆదుకోవడానికి రూపొందించిన రైతు బీమా పథకాన్ని కూడా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. దేశానికే ఆదర్శంగా మారిన ప్రతిష్ఠాత్మక రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ముఖ్యమంత్రి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వేదికగా ప్రారంభించినవన్నీ సూపర్హిట్ అయ్యాయి. దీంతో దళిత బంధు పథకానికీ అదే ఆనవాయితీని సీఎం కొనసాగించనున్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పథకం ప్రారంభోత్సవ తేదీని త్వరలో కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.