ఇల్లందుకుంట: దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని, దళితులను బాగు చేసే పథకం మాత్రమేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో ఇక నవశకం మొదలైనట్లేనని చెప్పారు. ఇల్లందకుంటలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సరికొత్త పథకంతో దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నామని చెప్పారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే దీని లక్ష్యమన్నారు. దళితులందరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎవరూ ఆగం కావద్దని సూచించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులకు సంబంధం లేకుండా బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.1500 కోట్లను కేటాయించారని, అవసరమైతే మరొక రూ.500 కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.
దళితులు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అంబేదర్ విదేశీ విద్యావిధానం ద్వారా రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని, ఎంపీటీసీలు రమ, ఐలయ్య, సర్పంచ్లు దిలీప్రెడ్డి, మానస, రజిత, మొగిలి తదితరులు పాల్గొన్నారు.