రోజుకు 400 చొప్పున ఎంపిక
సీఎంకు అధికారుల నివేదిక
మరింత వేగంగా దళితబంధు
దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లులు
దళితబంధుపై సమీక్షలో కేసీఆర్
త్వరలోనే జిల్లా కలెక్టర్లతో భేటీ
దళితబంధు ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యాలు, తద్వారా వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంచడంలో దోహదపడుతాయి. ఇప్పటి వరకు దళితబంధు ద్వారా అందిన ఆర్థికసాయంతో వ్యాపార, వృత్తిరంగాల్లో దళితులు సాధిస్తున్న
విజయాలే అందుకు తార్కాణం. – ముఖ్యమత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం అవసరమైన నిధులను విడుదల చేసింది.
గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం జరుగొద్దు’ అని స్పష్టంచేశారు. దళితబంధును మరింత ప్రభావవంతంగా, వేగవంతంగా అమలు చేసేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ‘దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకొంటున్నాం. దీనిద్వారా మనం అనుకొన్నదానికంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. దళితబంధు కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి, తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుంది.
సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యాలు, తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంచడంలో దోహదపడుతాయి. ఇప్పటి వరకు దళితబంధు ద్వారా అందిన ఆర్థికసాయం ద్వారా వ్యాపార, వృత్తిరంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం’ అని సీఎం అన్నారు. ‘ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలి. తద్వారా దళిత యువతలో నెలకొన్న నిరాశా నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. దవాఖానలు, ఎరువుల దుకాణాల వంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటుచేసి వారికి అవకాశాలు కల్పించాలన్నారు.