నల్లగొండ : దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు.
సోమవారం నకిరేకల్ మండలం నడిగూడెం, వల్లభాపురం గ్రామాలతో పాటు నార్కట్పల్లి మండలం బాజాకుంటా లకు చెందిన 45 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యమ కాలంలోనే కేసీఆర్ ఈ బృహత్తర ప్రణాళికకు అంకురార్పణ చేశారని ఆయన తెలిపారు. అది నేడు అమలులోకి వచ్చిందన్నారు. ఆర్థిక అసమానతలను రూపు మాపడంతో పాటు ఈ పథకం దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలకనుందన్నారు.
గాంధీజీ మొదలు తొలి ప్రధానిజవహర్ లాల్ నెహ్రు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు ఈ పథకంతో సాకమవుతున్నాయన్నారు. గడిచిన 75 ఏండ్లుగా కొంత ప్రయత్నం జరిగినప్పటికి ఆశించిన మేర ఫలితాలు రాలేదన్నారు.
ఈ క్రమంలో నే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి పై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ పథకం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక విప్లవం సృష్టిస్తుందని మంత్రి తెలిపారు.