సూర్యాపేట, మే 3 (నమస్తే తెలంగాణ): దళితుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారులకు వరంలా మారింది. సర్కారు సాయంతో దళితబంధు ద్వారా ట్రాక్టర్లు తీసుకొన్న లబ్ధిదారులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. పనులు లేని ఈ సమయంలో సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని యాసంగి ధాన్యం రవాణా చేసే అవకాశాన్ని వారికి కల్పించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేయడం ద్వారా వారికి అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఈ మేరకు సూర్యా పేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తవడంతో ట్రాక్టర్లకు అంతగా కిరాయిలు రావడం లేదు.జిల్లాలో 394 మంది లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా 4 నియోజకవర్గాల పరిధిలో 394 మంది లబ్ధిదారులు దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. రెండ్రోజుల్లోనే దాదాపు 60 ట్రాక్టర్లు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశాయి. ట్రాక్టర్లో వెళ్లే ఒక్కో బస్తాకు దూరాన్ని బట్టి రూ.8 నుంచి రూ.15 వరకు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఉండటంతో దాదాపు అన్ని ట్రాక్టర్లకు పని దొరకనున్నది. తిరుమలగిరి మండలంలోని 45 ట్రాక్టర్లతో రెండు రోజులపాటు ధాన్యం రవాణా చేశారు. ఇతర మండలాల్లో 15 ట్రాక్టర్లు రంగంలోకి దిగాయి.
బస్తాకు రూ.8 నుంచి రూ.15 వరకు చెల్లింపు
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు ఉన్న దూరాన్ని బట్టి ఒక్కో బస్తాకు రూ.8 నుంచి రూ.15 వరకు ట్రాక్టర్ యజమానికి ఇవ్వనున్నారు. కొను గోలు కేంద్రం నుంచి మిల్లుకు 12 కిలోమీటర్ల లోపుంటే బస్తాకు రూ.8 ఇస్తుండగా, 12 నుంచి 20 కిలోమీటర్ల వరకు బస్తాకు రూ.12, 20 కిలోమీటర్ల పైన ఉంటే రూ.15 చొప్పున ఇవ్వనున్నారు. రవా ణా కాంట్రాక్టర్లే సకాలంలో కిరాయి సొమ్ము చెల్లి స్తారని పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి తెలి పారు. ఒక ట్రాక్టర్ ఒక్క లోడు రవాణా చేసినా ఖర్చులు పోను రూ.వెయ్యి వరకు మిగులుతుంది. పనులు లేని ఈ సమయంలో అధికారులు ఉపాధి అవకాశం కల్పించడం పట్ల దళితబంధు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిప్పుకు వెయ్యి మిగులుతున్నయ్!
రెండ్రోజుల్లో గాంధీనగర్, రామన్నగూడెం నుంచి రైస్మిల్లుకు రెండు ట్రిప్పులు వేసిన. ట్రిప్పుకు రూ.వెయ్యి వరకు మిగులుతున్నాయి. మాకు ఎలాంటి రుణం, ఈఎంఐ లేకుండా ప్రభుత్వం దళితబంధు యూనిట్ ఇచ్చింది. ట్రాక్టర్ నడుపుకుంటూ దర్జాగా బతుకుతున్నా.
– చింత అంజయ్య, దళితబంధు ట్రాక్టర్ యజమాని
అన్ని ట్రాక్టర్లనూ వినియోగిస్తాం
మరో రెండ్రోజుల్లో జిల్లావ్యాప్తంగా దళితబంధు ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో ధాన్యం రవాణాకు వినియోగిస్తాం. పంచాయతీ ట్రాక్టర్లనూ వినియోగించాలని ఆదేశాలిచ్చాం. పనులు లేని ఈ సమయంలో ధాన్యం రవాణాతో లబ్ధిదారులకు ఆదాయం సమకూరుతున్నది. వర్షాల నేపథ్యంలో ధాన్యం సకాలంలో ఎగుమతి అవుతుంది.
– ఎస్ వెంకట్రావ్, కలెక్టర్, సూర్యాపేట జిల్లా