వరంగల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళితబంధును అమలుచేయాలని సవాల్ చేశారు. ప్రజలకు మరింత మేలు జరిగేలా అవసరమైతే రాజ్యాంగంలో మార్పులు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాసర్తో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని 51 మంది లబ్ధిదారులకు రూ.4.86 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తొలి విడుత దళితబంధు అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బీజేపీ దళితులకు, బీసీలకు వ్యతిరేక పార్టీ అని అన్నారు. దళితులను ఊచకోత కోసి, లైంగికదాడులు చేసి చంపిన ఘనత బీజేపీదేనని వ్యాఖ్యానించారు. దళితబంధును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దళిత సమాజం రుణపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకంతో న్యాయం జరుగుతుందని చెప్పారు. నిన్నటివరకు డ్రైవర్లుగా ఉన్నవారు ఇప్పుడు ఓనర్లయ్యారని, వారి కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదని అన్నారు. పేదల కోసం తెచ్చిన పథకాలపై బీజేపీ నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతికహకు పేదలను దోచుకుంటున్న బీజేపీకి లేదని చెప్పారు.
అంబేద్కర్ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పేదలకు మరింత న్యాయం జరిగేందుకు రాజ్యాంగంలో మార్పులు చేసి, ఇంకా పటిష్టం చేయాలనేది కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని తెచ్చారని, మూడునాలుగు ఏండ్లలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలు ఈ నెల 5 లోపు లబ్ధిదారుల జాబితాను తమ జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని కోరారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి ఈ నెల 7 లోపు బ్యాంకు ఖాతా తెరువాలని సూచించారు. మార్చి 7లోపు ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో రూ.10 లక్షల జమ చేయడంతోపాటు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు. దళితబంధును పటిష్టంగా అమలుచేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ అధ్యక్షులు ఎం సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ విజయ్కుమార్, ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.