మెదక్, ఫిబ్రవరి 13: ‘దండం లేదు.. పైరవీ లేదు.. కాళ్లు మొక్కుడు లేదు.. ఒక్క రూపాయి లంచం ఇచ్చుడు లేదు.. దళారులను నమ్మాల్సిన అవసరం అసలే లేదు’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని, మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం దేశంలో రూ.10 లక్షలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ? అని అడిగారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, నేరుగా వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేస్తున్నారని తెలిపారు. పైరవీలకు తావు లేకుండా, దళారుల ప్రమేయం అసలే లేకుండా నేరుగా లబ్ధిదారుకే నిధులు ఇస్తున్నారని స్పష్టంచేశారు. దళితులందరూ గెలిచి తీరాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ప్రస్తుతం తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి వంద మందికి పథకం అమలు చేస్తున్నారని, మార్చి తర్వాత నియోజకవర్గంలో 2 వేల మందికి వర్తింపజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యరంగంలో నంబర్ వన్గా తెలంగాణ
కామారెడ్డి: ఆరోగ్య రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపాలని మంత్రి హరీశ్రావు వైద్యారోగ్య సిబ్బందికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్లు, 4జీ సిమ్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్లో విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్షిండే, పద్మాదేవేందర్రెడ్డి తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే టాప్- 3లో ఉన్నదని చెప్పారు. బీపీ, షుగర్ బాధితులకు త్వరలో ఎన్సీడీ కిట్లను అందించనున్నట్టు తెలిపారు. 22 మాతా శిశు కేంద్రాలకుగాను రూ.407 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా మార్చురీల ఆధునీకరణకు రూ.32 కోట్లను విడుదల చేశామని వెల్లడించారు. ఏఎన్ఎంలకు కూడా ఐపాడ్ ఇచ్చి ఆన్లైన్ సేవల్లో వారిని భాగస్వాములుగా చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఫీవర్ సర్వేలో ఆశ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.