మందమర్రి, సెప్టెంబర్ 2: మేకను దొంగిలించాడని ఆరోపిస్తూ దళితుడిని వాసానికి తలకిందులుగా వేలాడదీసి కట్టేసి కొట్టిన కేసులో నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియాకు చెందిన రాములు- స్వరూప దంపతులతోపాటు వారి కుమారుడు శ్రీనివాస్ జాతీయ రైల్వే ట్రాక్ సమీపంలో షెడ్డును నిర్మించుకొని మేకలను పెంచుతున్నారు. ఇటీవల మంద నుంచి ఒక మేక చోరీకి గురయ్యింది. అదే ప్రాంతానికి చెందిన తాపీమేస్త్రీ దగ్గర కూలీ పనులుచేసే కిరణ్ మేకను దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం అతడిని షెడ్డుకు పిలిపించారు. వారితోపాటు కూలీ నరేశ్ కలిసి షెడ్డు వాసానికి కిరణ్ను తాడుతో తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి కొట్టారు. మేకకు సంబంధించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే ప్రాంతానికి చెందిన శ్రావణ్ డబ్బులు తాను చెల్లిస్తానని చెప్పి కిరణ్ను ఇంటికి తీసుకెళ్లాడు. కిరణ్కు తల్లిదండ్రులు చనిపోవడంతో తన చిన్నమ్మ సరిత వద్ద ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్.. తిరిగి రాలేదు. ఆందోళన చెందిన అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ దళితుడు కావడంతో అతనిని కొట్టిన నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన కిరణ్ కోసం నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.