హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలును ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని సైతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటుగా కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు.