హైదరాబాద్ : బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. సీఎం కేసీఆర్కు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల అభివృద్ది కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. త్వరలోనే హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వున్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
అనంతరం ఎంపీ తిరుమావళవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని చెప్పారు. దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు.
సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిషా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులు ఉన్నారు.