యాదాద్రి భువనగిరి : దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రిలో దళిత బంధు లాంచ్ అయిందని హూజూరాబాద్లో ప్రారంభమయ్యేది ఇక లాంఛనమేనని సీఎం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించారు. గ్రామంలోని దళితవాడలో మూడు గంటలకు పైగా కాలినడకన కలియతిరిగిన సీఎం ప్రతీ ఒక్కరిని పలకరించి యోగ క్షేమాలను ఆరాతీశారు. సమస్యలను ఆలకించారు. ఇండ్లను, డ్రైనేజీలను పరిశీలించారు.
అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగిస్తూ వాసాలమర్రిపై వరాల జల్లే కురిపించారు. గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచే(గురువారం) దళితబంధు నిధులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటల వరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులు అకౌంట్లో జమకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు వాసాలమర్రి గ్రామానికి రూ.7.60 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
దళిత బంధు నిధులతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. గ్రామాన్ని సకల సౌకర్యాలతో తిరిగి నూతనంగా పునర్నిమించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామన్నారు. నిధులు వృథా కాకుండా ఉపాధి కలిగే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అతిత్వరలోనే వాసాలమర్రి తాను చెప్పిన విధంగా బంగారు వాసాలమర్రి కానున్నట్లు సీఎం పేర్కొన్నారు.