మంగపేట, ఫిబ్రవరి 3 : దళితబంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా మంగపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దళితబంధు పథకం రెండో విడతకు ఎంపికైన ఆయా గ్రామాల దళితులు తమకు మంజూరైన నిధులను విడుదల చేయాలని కోరుతూ ఒకరోజు దీక్ష నిర్వహించారు.
లక్ష్మీనారాయణ వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిరుపేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ సర్కారు దళితబంధు ప్రవేశ పెట్టి లబ్ధిదారులను ఈ పథకానికి ఎంపిక చేసిందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరిచి, నిధుల కేటాయింపు సైతం పూర్తి అయిందని, ఎన్నికల కోడ్ కారణంగా మంజూరు నిలిచిపోయినట్టు పేర్కొన్నారు. పేద దళితుల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే వారి ఖాతాల్లో దళితబంధు నిధులు జమచేయాలని డిమాండ్ చేశారు.