దళితబంధు కార్యక్రమం నేటితో ఏడాది పూర్తిచేసుకోనున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా రూ.2 వేల కోట్లతో మొదలైన ఈ పథకం నేడు ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది.
కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఏడాది కిందటి వరకు పేదరికంలో మగ్గిన కుటుంబాలు దళితబంధుతో గాడిన పడుతున్నాయి. తమ కాళ్లపై తాము నిలబడి మరి కొందరికి ఉపాధి కూడా కల్పించే స్థాయికి హుజూరాబాద్ దళితులు ఎదుగుతున్నారు. గత ఏడాది హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన దళితబంధు పథకం వేల మంది దశను మార్చింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో 13,944 మంది లబ్ధిదారులను గుర్తించారు. 11,480 మందికి వారు కోరుకున్న యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఇంకా 2,464 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నది. 195 మంది యూనిట్లు గ్రౌండింగ్ కోసం కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు చేసి ఉంచారు.
పెరిగిన సామాజిక గౌరవం
దళిత బంధుతో దళితుల జీవితాల్లో మార్పులు రావడమే కాకుండా సమాజంలో వారికి సామజిక గౌరవం కూడా పెరిగింది. దళిత బంధుతో వస్తున్న ఆదాయంతో కుటుంబాలు బాగా గడుస్తున్నాయి. గతంలో వ్యవసాయ కూలీలుగా, ట్రాక్టర్, టాక్సీ, హార్వెస్టర్, జేసీబీ డ్రైవర్లుగా ఉన్న దళితులు దళితబంధు పథకం ద్వారా నేడు యజమానులుగా మారారు. చదువుకున్న యువకులు కంప్యూటర్ సెంటర్లు, మెడికల్ షాపులు, మీ సేవ కేంద్రాలు పెట్టుకున్నారు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు రోజువారీ ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు.
కొత్తూరి రాధ జీవితం నిలబడ్డది
కూలీ పనే జీవనాధారంగా ఏండ్లపాటు బతుకీడ్చిన కొత్తూరి రాధ జీవితం నిలబడ్డది. దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా డెయిరీ యూనిట్ మంజూరు పత్రాన్ని అందుకున్న ఆమె, ఆర్థికంగా అభ్యున్నతి సాధించింది. హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ- మొగిలి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కైకిలి చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసేవాళ్లు. నానా తంటాలు పడి ఇద్దరు బిడ్డలకు పెండ్లి చేశారు. మరో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. ఈ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబందు పథకం అండగా నిలిచింది. పథకం కింద రూ.10 లక్షలు రాగా మొదటి దఫాలో రూ.5.50 లక్షలతో డెయిరీని ప్రారంభించారు. రూ.4 లక్షలతో నాలుగు గేదెలు, రూ.1.50 లక్షలతో రేకుల షెడ్డు, ఇతరాత్ర సౌకర్యాలకు వెచ్చించారు. నాలుగు గేదెలతో అన్ని ఖర్చులు పోనునెలకు రూ.15 వేల ఆదాయం పొందుతున్నారు.
రోజుకు 2 వేల గిరాకీ అవుతున్నది
మా నాన్న కూలీ పని చేసేవారు. అమ్మ బట్టల దుకాణంలో పనిచేసేది. సీఎం కేసీఆర్ దయతో దళితబంధులో భాగంగా మాకు మినీ సూపర్ బజార్ వచ్చింది. దీంతో మా అమ్మ బట్టల దుకాణంలో పని మానుకున్నది. ఇపుడు నేను, మా అమ్మ మా దుకాణంలోనే ఉంటున్నాం. రోజుకు రూ.2 వేల దాకా ఆదాయం వస్తున్నది. మాకు ఇలాంటి మంచి రోజులు వస్తాయని అనుకోలేదు. ఈ సూపర్ బజార్నే మరింత అభివృద్ధి చేసుకుని మా జీవితాలను మరింత మెరుగు పర్చుకోవాలని చూస్తున్నాం.
– గొర్రె అభిలాష్, హుజూరాబాద్