హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న ‘దళిత బంధు’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎస్సీ, ఎస్టీ వ్యాపారస్తుల సంక్షేమం కోసం ముఖ్యమైన, వ్యూహాత్మక వైవిధ్య అవకాశాల కోసం బ్లాక్ చాంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో కలిసి చర్చించినట్టు ఆయన తెలిపారు. దళిత బంధుతో దళితులు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు అనువుగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా, నేషనల్ బ్లాక్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇల్లినాయిస్ స్టేట్ బ్లాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రసంగించాలని రవికుమార్ను ఆహ్వానించినట్టు డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు దాసరి అరుణ తెలిపారు.