Dalit Bandhu | హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని గన్ పార్క్ వద్ద రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్, రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కోగిల మహేష్, సమ్మయ్య మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్న రెండో విడత దళిత బంధు నిధులు జమ చేయకపోవడం దారుణమన్నారు. ఈ నెల 12వ తేదీన జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి వారికి న్యాయం చేయాలన్నారు. వివిధ దశలలో శాంతియుత మార్గాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే గన్ పార్క్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
రేపటి కేబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసి అలాగే దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఏ సంక్షేమ పథకానికైనా చట్టరూపం తీసుకువచ్చేలా నూతన ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంటు ఎన్నికలే ఎజెండాగా దళిత బంధు లబ్ధిదారులందరూ కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం వర్గానికి 100 మంది దళిత బంధు లబ్ధిదారులు నామినేషన్ వేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత బంధు కోఆర్డినేటర్ మడికొండ రమేష్, కావేరి చిన్ని కృష్ణ, రాష్ట్ర నాయకులు బోనగిరి శ్రీనివాస్, బాలనర్సు, ఎలకంటి దేవయ్య దర్శనాల సంజీవ, ఏకు కార్తీక్, కోట ప్రమోద్, రాంబాబు, బియ్యం శ్రీను, జన్నారపు శ్రీనివాస్, ఆరెందుల కుమార్, తోగరు అశోక్, చంటి భద్రయ్య, జనగాం రవీందర్, కనకం రంజిత్, దేపాక శ్రీరామ్, గంగర్ల వెంకటేశ్వర్లు, పూసల నరసింహారావు, సాంబశివరావు, రూపేష్, మధు, మాఊరి వెంకన్న, కావేరి సూరయ్య, వివిధ జిల్లాల దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.