వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్లి గ్రామాల్లో శనివారం దళితబంధు పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి ఆయా గ్రామాల్లోని దళిత వాడల్లో కలియ దిరిగారు. సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. వెనుకబడిన దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధుకు అంకురార్పణ చేశారని చెప్పారు. దళిత బిడ్డలు ఆలోచన చేయాలని, ఆగం కావొద్దని సూచించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజూరాబాద్ మండలం శాలపల్లిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగనున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలం నుంచి భారీ సంఖ్యలో దళితులు తరలిరావాలని పిలుపునిచ్చారు.