కడ్తాల్, జూలై 13: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యం లో.. వివిధ అంశాలపై శిక్షణ పొందుతున్న పలు రాష్ర్టాలకు చెందిన 30 మంది అధికారుల బృందం గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామంలో పర్యటించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా బాగున్నదని కితాబిచ్చారు. ఈ పథకం కింద లబ్ధిదారుడు పోతగళ్ల మహేశ్ ఏర్పాటు చేసుకున్న పశువుల షెడ్డు, ఆవులను అధికారులు పరిశీలించారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం, విధివిధానాలు, లబ్ధిదారుల ప్రయోజనాలు తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతాయని తెలిపారు.