హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రచార సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దళిత, ఆదివాసీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ద్రౌపది ముర్ము పరిచయ కార్యక్రమంలో పారిశుధ్య పని గురించి ప్రస్తావించారు. గతంలో ఈ పనిచేసేవారంతా చేతులతో మల, మూత్రాలను ఎత్తిపోసేవారంటూ అవహేళనగా మాట్లాడారు. ఆ పనివారికి బీజేపీ వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటూ ప్రగల్భాలు పలికారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై దళిత, ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళిత, ఆదివాసీల వృత్తులను కించపరిచేలా వ్యాఖ్యానించిన సోము వీర్రాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరించాయి. సోము వీర్రాజు వ్యాఖ్యలు బీజేపీ నేతల అహంకారానికి నిదర్శనమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. దళిత, ఆదివాసీ ప్రజల పట్ల బీజేపీ నేతలకు ఉన్న చిన్నచూపు, సంకుచిత వైఖరి వీర్రాజు వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు.