నిజామాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం రూ.80 కోట్ల మేర పాల బిల్లులు నిలిపివేసింది. ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించే విజయ డెయిరీ.. ఇప్పుడు 45 రోజులైనా ఇవ్వడం లేదు. దీంతో పాడి రైతులు కుటుంబాలను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. పాడి పశువుల కిస్తీలు కట్టలేకపోతున్నారు. పాడి రైతుల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బుధవారం పాడి రైతులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు.. పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతి రోజు పాలు సరఫరా చేస్తున్నారు. అయితే.. 45 రోజులుగా పాల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో రూ.80 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా.. బ్యాంకులు, మహిళా సంఘాలు, వడ్డీ వ్యాపారులకు కిస్తీలు కట్టలేకపోతున్నారు. పశువులకు దాణా, మిండ్రాల్ మిక్చర్, క్యాల్షియం మందుల కొనుగోలు చేయకలేకపోతున్నారు. ఇందుకోసం మరింత అప్పు చేయాల్సి వస్తున్నది. వాటిపై ఇప్పటికే ఒక నెల వడ్డీ మీద పడింది. పాల డబ్బుల చెల్లింపులకు విజయ డెయిరీ చేస్తున్న జాప్యంతో తమ కష్టార్జితం వడ్డీలకే చెల్లించుకునే దౌర్భాగ్యం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పాడి రైతులను కేసీఆర్ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకున్నది. ప్రైవేటు డెయిరీల నుంచి విజయ డెయిరీని కాపాడేందుకు పాల ధరతోపాటు లీటర్కు రూ.4 అదనంగా నగదు ప్రోత్సాహాన్ని అందించారు. అతి తక్కువ ధరలో విజయ పశుదాణా పంపిణీ, పాడి పశువుల ఆరోగ్యం కోసం పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించింది. పాల బిల్లులు ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు జరిగాయి. కాంగ్రెస్ పాలనలో ప్రోత్సాహకం పక్కన పెడితే.. విక్రయించిన పాల డబ్బులే సరిగా చేతికి అందించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
విజయ డెయిరీ బకాయిల కథ ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంది. నిజామాబాద్లో ఆరున్నర వేల మంది రైతుల పేర్లు విజయ డెయిరీలో నమోదు కాగా.. 4,500 మంది సీజన్లో పాలను విక్రయిస్తున్నారు. సెప్టెంబర్-ఫిబ్రవరి మధ్య కాలాన్ని సీజన్గా పరిగణిస్తున్న సమయంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున పాలు సేకరిస్తారు. మార్చి-ఆగస్టు వరకు అన్సీజన్ కాలంలో 2 వేల మంది పాలు పోస్తారు. ప్రస్తుతం జిల్లాలో 4,500 మంది రైతులకు ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చిలో అందించాల్సిన రెండు పేమెంట్స్ కలిపి మొత్తం మూడు విడతల బకాయిలు ఉన్నాయి. ఒక పేమెంట్ అంటే.. 15 రోజులకు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా రూ.31 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు చెల్లింపులు జరుగుతాయి. ఈ లెక్క ప్రకారం రూ.కోటి వరకు పాడి రైతులకు విజయ డెయిరీ బాకీ పడింది.
నాకు సుమారుగా రూ.50 వేల వరకు రావాలి. ఈఎంఐలు కట్టలేక, పశువులకు దాణా అందించలేక ఇబ్బందిగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జాప్యం జరగలేదు. వెంటనే బిల్లులు మంజూరు చేయాలి.
– చిలకపాటి ప్రశాంత్, పాడి రైతు, కోటగిరి, నిజామాబాద్ జిల్లా
పాడి రైతులకు పాల బిల్లులు నిలిచిపోవడం నిజమే. గతంలో 15 రోజులకోసారి బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతున్నాం. త్వరలోనే పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తవుతాయి. రైతులెవరూ ఆందోళన చెందొద్దు.
– నందకుమారి, డీడీ, విజయ డెయిరీ, నిజామాబాద్ జిల్లా