పటాన్చెరు, జనవరి 10: జర్నలిస్టులకు సవాళ్లు కొత్త కాదని దైనిక్ భాస్కర్ గ్రూప్ ఎడిటర్ ప్రకాశ్ దూబే అన్నారు. స్వతంత్ర సంగ్రామంలోనూ జర్నలిస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నారని చెప్పారు. అప్పుడు కూడా త్యాగాలకు, జైలు జీవితాలకు సిద్ధిపడినవారే జర్నలిస్టు వృత్తిని ఎంపిక చేసుకునేవారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్లో మూడు రోజుల పాటు జరిగిన ఐజేయూ 10వ ప్లీనరీ మంగళవారం ముగిసింది. చివరి రోజు ‘మీడియా ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో దైనిక్ భాస్కర్ ఎడిటర్ ప్రకాశ్ దూబే, తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మా ట్లాడారు. జర్నలిజం నేడు అనేక ఆటుపోట్లను ఎదుర్కుని మనుగడ కొనసాగిస్తున్నదని ప్రకాశ్ దూబే చెప్పారు. ధార్మిక, జాతి, భాష, ప్రాంతం ఆధారంగా దేశాన్ని విడదీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చివరికి మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా ఆదేశాలు ఇచ్చే పరిస్థితులను ప్రస్తుతం దేశంలో చూస్తున్నట్టు చెప్పారు. గతంలో దేవుళ్లను నిలదీస్తూ హీరోలు సినిమాలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
దేశవ్యాప్తంగా మీడియా హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. యూపీలో ఒక బాలిక లైంగికదాడి ఉదంతాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చిన జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ను జైలుకు పంపించారని చెప్పారు. ఈ సంఘటన దేశంలోని భయానక పరిస్థితులను తెలియజేస్తున్నదని అన్నారు. జర్నలిస్టులకు సమస్య వచ్చినప్పుడు ఒక్కటై వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. సంఘటితంగా జర్నలిస్టులు కదిలితేనే సమస్యలను పరిష్కరించుకోగలమని చెప్పారు.
మీడియాపై నిరంకుశం: అల్లం నారాయణ
కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తూ జర్నలిజం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే హెచ్ 143 (ఐజేయూ) అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. నరేంద్రమోదీ, అమిత్షా గొంతుతప్ప దేశంలో మరే గొంతు వినపడకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారని, మీడియా గొంతు నొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కార్పొరేట్ వ్యవస్థ చేతిలో చిక్కిన మీడియా విశ్వసనీయతను కోల్పోతున్నదని అన్నారు. ఇంతకుముందున్న చట్టాలు పునరుద్ధ్దరించాలని కోరుతున్న జర్నలిస్టులు ఇప్పుడు అవి కూడా క్రమంగా ఉనికి కోల్పోతుండటంతో దిక్కులు చూడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ ప్రయత్నించాలని చెప్పారు. ఇప్పుడు ఫేక్ న్యూస్ అన్ని మీడియాలకు శాపంగా మారిందన్నారు. దాని కారణంగా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలు ఏ రిజల్ట్ కావాలన్నా పొందే అవకాశం లభించిందని చెప్పారు.
జర్నలిస్టులకు వేతన బోర్డు, జాతీయ స్థాయిలో చట్టాలు అవసరం అని చెప్పారు. తెలంగాణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి గౌరవప్రదంగానే ఉన్నదని చెప్పారు. మీడియాపై ఆంక్షలు, ఇతర నిర్బంధాలు లేవని తెలిపారు. 3 రాష్ర్టాల్లో ఉన్న ఐజేయూ పెద్దదా.? 18 రాష్ర్టాల్లో ఉన్న ఐజేయూ పెద్దదా.? అని అల్లం నారాయణ ప్రశ్నించారు. ప్లీనరీ, మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్రెడ్డి, టీయూడబ్ల్యుజే హెచ్ 143 రాష్ట్ర కార్యదర్శి మారుతీ సాగర్, ఫౌండర్ ప్రెసిడెంట్ (ఐజేయూ) సురేశ్ అకౌరీ, జాతీయ ఐజేయూ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవ్వారి భాస్కర్, యోగినాథ్, ఇస్మాయిల్, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఐజేయూ నూతన కమిటీ ఎన్నిక
ఐజేయూ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ నూతనంగా ఎన్నికైన కమిటీని పరిచయం చేశారు. నూతన కమిటీ జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు కృషిచేస్తుందని ఈ కమిటీ 2023 నుంచి 2025 వరకు పనిచేస్తుందని చెప్పారు. ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ, వైస్ప్రెసిడెంట్లు సయ్యద్ ఇస్మాయిల్ (తెలంగాణ), నారాయణ్ పంచాల్(మహారాష్ట్ర), కార్యదర్శులు రతుల్ బోరా(అస్సాం), రాజమౌళిచారి (తెలంగాణ), ట్రెజరర్ నత్మల్ శర్మ (ఛత్తీస్గఢ్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నవీన్ శర్మ (చండీగఢ్), అవ్వారి భాస్కర్(తెలంగాణ), కేసీ స్మిజన్(కేరళ), బాబు థామస్ (కేరళ), అనిల్ బిశ్వాస్(కేరళ), తారక్నాథ్ రాయ్(పశ్చిమబెంగాల్), కే రవి (మహారాష్ట్ర) జీటు కలిత(అస్సాం).