అశ్వారావుపేట/దుమ్ముగూడెం/ఇల్లెందు, అక్టోబర్ 11 : ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డెయిలీ వేజెస్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం నాటికి 30వ రోజుకు చేరింది. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు మురహరి శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేదని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దుమ్ముగూడెంలో చేపట్టిన కార్మికుల సమ్మెకు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచి వంశీకృష్ణ, ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట చేపట్టిన సమ్మెకు సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్ నబి సంఘీభావం తెలిపారు.