జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): దేశానికి, రాష్ర్టానికి దగుల్బాజీ పార్టీలు అన్యాయం చేశాయని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. 75 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గ్రామాలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో ఆదివారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ భవేశ్మిశ్రా తదితరులతో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో నీళ్లు, నిధులు ఇవ్వలేదని, పనులు లేక ప్రజలు, కుల వృత్తులు ఆగమై వలసపోయే దుస్థితిని కల్పించాయన్నారు. 75 ఏండ్ల దరిద్రాన్ని కేవలం ఏడేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. దేశాన్ని, రాష్ర్టాన్ని నాశనం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వారు పాలిస్తున్న ఛత్తీస్గఢ్, కర్ణాటకలో సంక్షేమ పథకాలు అందించడం లేదని, మళ్లీ వాళ్లే తెలంగాణలో ఏమీ జరగడం లేదని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతగాని వాళ్లు ఏదేదో మాట్లాడుతారని, అవన్నీ పట్టించుకోకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. వాళ్ల మాయమాటలకు బోల్తా పడదామా? మన కోసమే పని చేసే సీఎం కేసీఆర్ను కాపాడుకుందామా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయాలను ప్రజలు విశ్లేషించుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూడాలని కోరారు.