హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మాండూస్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలో తుఫాను తీవ్రత అధికంగా ఉంది. భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. కాగా, మాండూస్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీవారి మెట్లమార్గం గుండా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అలాగే, పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను కూడా మూసివేసినట్టు దేవస్థానం ప్రకటించింది. భారీవర్షాల కారణంగా కొండపైకి వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో భక్తులను అప్రమత్తం చేసింది. ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి భక్తుల, వాహనాల రాకపోకలను నిలిపివేసింది. తుఫాన్ కారణంగా తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. ఆదివారం కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం తిరుమలలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది.