హైదరాబాద్: రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఇప్పుడు దీనిని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్తో వాహనదారులను కేటుగాళ్లు మోసంచేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నారు. గుర్తించిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు.
నకిలీ వెబ్సైట్లో పేమెంట్స్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. పేటీఎం, మీసేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయాలని సూచించారు. అదేవిధంగా www.ehallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో చెల్లించాలని తెలిపారు. నకిలీ వెబ్సైట్ను ఎవరు సృష్టించారనే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. నిరుడు రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది.