హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డులతో ఫీజులు చెల్లిస్తామంటూ అమెరికా, కెనడాలోని వివిధ వర్సిటీల తెలుగు విద్యార్థులను మోసగించిన ఓ ముఠాను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో హైదరాబాద్కు చెందిన దేవరశెట్టి గౌతమ్, అతని తండ్రి వెంకటేశ్వర్లు, స్నేహితుడు కోహిర్కర్ నితేశ్ ఉన్నారని, వారి నుంచి 5 సెల్ఫోన్లు, చెక్బుక్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.71 లక్షల నగదును ఫ్రీజ్ చేశామని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చదువు కోసం అమెరికా వెళ్లిన గౌతమ్ ఈ దందాకు తెర లేపాడు. అక్కడ సెమిస్టర్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న పలువురు విద్యార్థుల వివరాలను సేకరించి.. క్రెడిట్ కార్డుతో ఆ ఫీజులను చెల్లిస్తామని, 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని నమ్మబలికాడు. ఆ సొమ్మును హైదరాబాద్లో తన తండ్రికి అందజేయాలని సూచించాడు.
ఆ మాటలను 32 మంది విద్యార్థులు నమ్మడంతో వారి వివరాలను నితేశ్ ద్వారా దుబాయ్లో ఉంటున్న జిబ్రాన్ అనే వ్యక్తికి పంపి క్లోనింగ్ క్రెడిట్ కార్డులతో ఆయా యూనివర్సిటీల ఫీజులు చెల్లించారు. దీంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొందరు నేరుగా సొమ్మును అందజేయగా.. మరికొందరు హైదరాబాద్లో గౌతమ్ తండ్రి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేశారు. ఇలా వసూలైన దాదాపు రూ.2 కోట్లలో 35% సొమ్మును గౌతమ్, 5% సొమ్మును నితేశ్ పంచుకొని.. 60% సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో జిబ్రాన్కు పంపారు. ఆ తర్వాత వీరి మోసం బయటపడింది. సెమిస్టర్ ఫీజు బకాయిలు చెల్లించాలని వర్సిటీల నుంచి మెసేజ్లు రావడంతో సదరు విద్యార్థులు నివ్వెరపోయారు. క్లోనింగ్ క్రెడిట్ కార్డులతో వారి పేరిట చెల్లించిన ఫీజులను ఆయా వర్సిటీలు తిరిగి బ్యాంకులకు ఇచ్చేసినట్టు తేలడంతో తామంతా మోసపోయామని గ్రహించారు. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్లో గౌతమ్ తండ్రి వెంకటేశ్వర్లును నిలదీశారు. రేపు మాపంటూ కాలయాపన చేయడంతో సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.