హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఆర్థికంగా మోసపోయిన బాధితుల్లో చాలా మందికి తమ డబ్బును తిరిగి పొందడం ఎలాగో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందితన తర్వాత బ్యాంకుల సాయంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు డబ్బును ఇతర ఖాతాలకు వెళ్లకుండా ఆపగలుగుతున్నప్పటికీ అలా ఫ్రీజ్ చేసిన డబ్బును తిరిగి బాధితుల ఖాతాలకు మళ్లించడం చాలా ఇబ్బందిగా మారుతున్నది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) ఏడీజీ శిఖాగోయెల్ బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, బాధితుల డబ్బు వెనక్కి వచ్చేలా చర్యలు చేపట్టారు.దేశంలోనే తొలిసారిగా లోక్ అదాలత్ల ద్వారా బాధితులు డబ్బును తిరిగి పొందే వెసులుబాటు కల్పించారు. దీంతో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 546 మంది బాధితులకు రూ. 2,19,80,840 అందించినట్టు శిఖాగోయెల్ వెల్లడించారు. సైబర్ నేరాల్లో నష్టపోయిన సొమ్మును బాధితులకు తిరిగి చెల్లిస్తున్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని ఆమె తెలిపారు.
ఫ్రీజ్ చేసిన సొమ్మును పొందాలంటే..
బాధితులు తాము ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్కు వెళ్లి సంబంధిత అధికారి ద్వారా కోర్టులో పిటిషన్ వేయాలి. తమ నుంచి నేరగాళ్లు కాజేసిన డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయో వివరించి, ఆ సొమ్మును ఇప్పించాలని పిటిషన్లో కోరాలి. అవసరమైతే ఆ పిటిషన్కు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్, ఇతర ఆధారాలు జత చేయాలి. అనంతరం విచారణాధికారి ఆ ఖాతాను వెరిఫై చేయడంతోపాటు అందులోని సొమ్మును బ్యాంకర్లు ఫ్రీజ్ చేసినట్టు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఆ సొమ్మును బాధితులకు వాపసు ఇప్పించవచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేస్తారు. దీంతో ఈ రెండింటినీ కోర్టు బేరీజు వేసుకుని రిఫండ్ కోసం ఆర్డర్ ఇస్తుంది. ఆ ఉత్తర్వు బ్యాంకులకు చేరిన వెంటనే డబ్బులు బాధితుల ఖాతాల్లోకి వచ్చేస్తాయి. ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో డబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసుల్లో కూడా బాధితుల డబ్బులు వాపసు ఇప్పించేందుకు సైబర్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు కూడా బాధితులు పై విధానాన్నే అనుసరించాలి. నాన్-ఎఫ్ఐఆర్ కేసులకు సంబంధించిన పిటిషన్లు అధిక సంఖ్యలో ఉంటే లోక్ అదాలత్లు నిర్వహించి ఒకేసారి క్లియర్ చేస్తుంటారు.
గంటలోపే ఫిర్యాదు చేయండి
సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930 నంబర్కు కాల్ చేయాలి. గంటలోపే ఫిర్యాదు చేస్తే నష్టపోయిన మొత్తం డబ్బును వెనక్కి తెచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడంలో ‘గోల్డెన్ అవర్’ చాలా ముఖ్యం. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని వారి నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లు, వెబ్సైట్ లింక్లు ఓపెన్ చేయకూడదు. బ్యాంకు ఖాతాలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు, ఓటీపీలు ఎవ్వరికీ చెప్పకూడదు.
– శిఖాగోయెల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏడీజీ