మణికొండ, అక్టోబర్ 23: మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అక్రమంగా గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారం కిందట మునుగోడు వద్ద భారీగా నగదు పట్టబడగా, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంబంధీకులు తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు పట్టుకొన్నారు. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన దేవల్రాజు, కార్వాన్కు చెందిన శ్రీకాంత్ సాగర్, విజయ్కుమార్, దేవులపల్లి నగేశ్, దాసర్లూథర్లు రెండు కార్లు, ద్విచక్ర వాహనంలో నగదు తరలిస్తుండగా నార్సింగి వద్ద పోలీసులు సీజ్ చేశారు.
ఈ నగదు మునుగోడుకు తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని, వారిని అరెస్టు చేసినట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ సొమ్మును కోమటిరెడ్డి రాజేందర్రెడ్డి తనయుడు సుమంత్రెడ్డికి అందజేయడానికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కోమటిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, సుమంత్రెడ్డి, సూర్యపవన్రెడ్డి, సునీల్రెడ్డి పరారీలో ఉన్నట్టు డీసీపీ చెప్పారు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం,మాల్లో ఆదివారం రూ.8 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సుద్దపల్లి, వింజమూరు సరిహద్దుల్లో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు, నాంపల్లి సీఐ విఠల్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.