హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రికార్డు సృష్టించారు. తమ వద్ద నమోదైన 44 కేసులను పరిష్కరించి, నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన రూ.2.23 కోట్లను రికవరీ చేసి, ఆ సొమ్మును సదరు బాధితులకు తిరిగి అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం మీడియాతో క్రైమ్ డీసీపీ కల్వేశ్వర్, సైబర్క్రైమ్ డీసీపీ రితిరాజ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంపాటి కేసుల వివరాలను వెల్లడించారు.
44 కేసుల్లో 2.23కోట్లు రికవరీ…
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్న 44 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సదరు బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసి.. ఆ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మొత్తం 44 మంది బాధితులకు రూ.2,23,89,575 అందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బాధితులకు అందజేశారు. తమిళనాడు కేంద్రంగా జరిగిన 13జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లో రూ.10 లక్షలు ఫ్రీజ్ చేశామని చెప్పారు. మరికొన్ని సైబర్ నేరాలలో అమాయకుల నుంచి దోచుకున్న రూ.10 కోట్లను ఫ్రీజ్ చేశామ వివరించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి 34 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా దేశవ్యాప్తంగా 811 సైబర్ నేరాలకు పాల్పడి, రూ.111కోట్లు దోచుకున్నట్టు పోలీసు అధికారులు వివరించారు.